కేసీఆర్ మాట లెక్కచేయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!

by Disha Web Desk 2 |
కేసీఆర్ మాట లెక్కచేయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ బాస్ సీఎం కేసీఆర్‌కు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఝలక్ ఇస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ స్పీడ్ పెంచిన తరుణంలో ప్రజలను తమ వైపు ఆకర్షించాల్సిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు తరచూ వివాదాస్పదం అవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రతిపక్షాలు ఎత్తుకు పైఎత్తు వేస్తున్న తరుణంలో సొంత పార్టీ ఎమ్మెల్యే తీరు కేసీఆర్‌కు మరింత ఇబ్బందిగా మారిందనే చర్చ జరుగుతోంది. ఇటీవల ముత్తిరెడ్డి యాదగిరి, దుర్గం చిన్నయ్య వంటి ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకోగా తాజాగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

దళిత బంధు విషయంలో ఆయన మాటలు దుమారం రేపుతున్నాయి. దీంతో మాదిగలను అవమానించిన గాదరి కిషోర్ తక్షమే క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లు ఆ వర్గం నుంచి వినిపిస్తున్నాయి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీరుపై సంచలనంగా మారింది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ముత్తిరెడ్డిపై ఇటీవల ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఓ భూమికి సంబంధించిన కేసులో తన సంతకం ఫోర్జరీ చేసి భూమి లాక్కున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఏకంగా లైంగిక ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఓ భూ సెటిల్మెంట్ కేసులో సాయం చేయాలంటే తన వద్దకు యువతులను పంపించాలని ఎమ్మెల్యే టార్చర్ చేస్తున్నాడంటూ ఆరిజన్ డెయిరీ నిర్వాహకులు ఆరోపణలు చేయడం దుమారంగా మారింది. దుర్గం చిన్నయ్య వ్యవహారంపై రెండు రోజుల క్రితమే రాష్ట్ర రాజధానిలో ప్లెక్సీలు, పోస్టర్లు కూడా వెలిశాయి.

గోరు చుట్టు మీద రోకలి పోటులా కేసీఆర్ పరిస్థితి:

ఎన్నికల ఏడాదిలో నేతలంతా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించినా సొంత పార్టీ ఎమ్మెల్యే తీరు కేసీఆర్‌కు ఇరుకున పెట్టేలా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఓ వైపు ప్రతిపక్షాల దూకుడుగా వ్యవహరిస్తుంటే మరో వైపు బీఆర్ఎస్ నేతల నోటిదురుసుతనం పార్టీకి తీరని నష్టం కలిగించేలా మారుతున్నాయి. పార్టీ విజయానికి ఊతం ఇస్తుందనుకున్న దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేల చేతివాటం కేసీఆర్ వరకు చేరిన సంగతి తెలిసిందే. లబ్ధిదారుల నుంచి బలవంతంగా ఎమ్మెల్యేలు వసూళ్లకు పాల్పడటంపై స్వయంగా కేసీఆరే స్పందించారు. ఇక బీసీలను ఆకట్టుకునేందుకు లక్ష ఆర్థిక సాయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగాల నోటిఫికేషన్లపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేక కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని సార్లు హెచ్చరించినా కొంత మంది ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకోకపోవడంతో ఈ పరిణామాలు కేసీఆర్ కు గోరు చుట్టు మీద రోకలి పోటుగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఇంత జరుగుతున్న సిట్టింగు లకే టికెట్లు ఇస్తానని కేసీఆర్ చెప్పడం ఇటు స్వపక్షంతో పాటు ప్రతిపక్షంలోనూ చర్చగా మారింది.

Also Read...

కేసీఆర్‌ను వాళ్లు నమ్మడం లేదా..? కొత్త చర్చకు తెరలేపిన కర్నాటక CM ప్రమాణాస్వీకారోత్సవ కార్యక్రమం



Next Story